చోడవరం, జూన్ 16(క్విక్ న్యూస్): గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు, ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ, రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చోడవరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వీ నాయుడు మాట్లాడారు.

2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సుమారు రూ.29 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఫ్యాక్టరీ మూసివేత దిశగా సాగడంతో సుమారు 28 వేల మంది షేర్హోల్డర్ రైతులు, కార్మికులు, పరోక్షంగా ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బకాయిల చెల్లింపుల కోసం పలుమార్లు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇటీవల రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు, కార్మికులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బి.దేముళ్లు, సుంకర అర్జున్, దుర్గా, పెంటకోట రాము, ఈశరపు శ్రీను, వరహాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.