గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు చోడవరంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. తలపై ఆకులతో తయారు చేసిన టోపీలు ధరించి, డోలీలు మోస్తూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. డోలీ మోతలు ఆపాలి.. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలి అంటూ నినాదాలు చేశారు.అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమానికి హాజరైన గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం నుంచి కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.చోడవరం–నర్సీపట్నం రహదారిని వెంటనే బాగు చేయాలని, గిరిజన గ్రామాలకు రోడ్లు, పాఠశాలలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. రెండేళ్లుగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.