రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పుల భారంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళనకరమని అనకాపల్లి జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు. గురువారం కె.కోటపాడు మండలంలోని మర్రివలస గ్రామంలో నిర్వహించిన కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు, గొర్లె దేవుడుబాబు, రెడ్డి అప్పలనాయుడు, పొంతపల్లి రామారావు, సిముసిరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.