విశాఖకు ఓవరాల్ కరాటే ఛాంపియన్‌షిప్

VarahalaBabu
1 Min Read

ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026లో విశాఖపట్నం జట్టు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. 126 పాయింట్లతో తొలి స్థానం దక్కించుకుని ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 102 పాయింట్లతో విజయనగరం ద్వితీయ స్థానం, 95 పాయింట్లతో అనకాపల్లి తృతీయ స్థానం సాధించాయి. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ విశాఖ నార్త్ ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్ ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. మహిళలు విద్య, క్రీడలు, వ్యాపారం, పరిపాలన తదితర రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అతిథులుగా విశాఖ జిల్లా ఓబీసీ బీజేపీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు చల్లా మంజుల, కనకమహాలక్ష్మి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, జనసేన 44వ వార్డు అధ్యక్షుడు పడాల పరమేశ్వరరావు, ఇండియా చీఫ్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ పి.ఆర్. రత్నపాల, డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ సి.హెచ్. సతీష్ కుమార్ పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్. శ్రీను, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కె. శివగణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. గౌరీశంకర్, రాష్ట్ర అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి. విగ్నేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ. వాసుదేవరావు, విశాఖ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి. నాగరాజు, జనరల్ సెక్రటరీ ఎన్. దేవిప్రియ తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article